దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గత కొన్ని రోజులుగా గాలి నాణ్యత సూచిక 400కిపైనే నమోదవుతోంది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితిని చాలా తీవ్రమైనదిగా అభివర్ణించింది. వాయు కాలుష్య తీవ్రతకు మాస్కులు కూడా సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులను వర్చువల్గా విచారణకు హాజరుకావాలని సూచించింది. వర్చువల్గా హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ మీరు ఎందుకు భౌతికంగా కోర్టు కార్యకలాపాలకు హాజరువుతున్నారని సీనియర్ న్యాయవాదులను జస్టిస్ పీఎస్ నరసింహ ప్రశ్నించారు. మీకు వర్చువల్గా విచారణకు హాజరయ్యే సౌకర్యం ఉంది. అయినా ఎందుకు వస్తున్నారు? దాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలుష్యం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని అన్నారు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని జస్టిస్ పీఎస్ నరసింహ తెలిపారు.


