జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ రహమత్నగర్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేశ్ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండించారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నామని, ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వలే ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు. కార్యకర్తలు ఎవ్వరూ దిగులు చెందొద్దని, కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఆపదొస్తే అన్ని వేళల్లో అండగా ఉంటాని తెలిపారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలన్నారు. దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమకు గతంలో 80 వేలు ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికలో 75 వేల ఓట్లు వచ్చాయని, ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ చేసినా మా ఓట్లు కేవలం 5 వేలు మాత్రమే తగ్గాయన్నారు. కచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు.


