పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కాంటెంప్ట్కు సిద్ధం కావాలని, స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని తాము ముందే చెప్పామన్నారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో స్పీకరే నిర్ణయించుకోవాలి అంటూ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్కు కోర్టు ధిక్కరణ కింద సుప్రీం నోటీసులు జారీ చేసింది. పార్టీ పిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు స్పీకర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణను 4 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
3 నెలల గడువు ముగిసిన నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గడువు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం మరో పిటిషన్ దాఖలు చేసింది. రెండు పిటిషన్లు కలిపి సిజెఐ ధర్మాసనం విచారణ చేసింది. గతంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ కార్యాలయాన్ని సిజెఐ మందలించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై ఇటీవలే కలకత్తా హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ 10 మందికి కూడా ముకుల్ రాయ్ తీర్పు వర్తిస్తుందని అంటున్న న్యాయ నిపుణులు చెబుతున్నారు.


