రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకమని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పర్యటిస్తున్న మోహన్ భగవత్ , అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రతీ దేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి గొప్ప నాగరికతలు నశించిపోయాయి. కానీ మన నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచే ఉంది. మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే మనం ఇంకా ఇక్కడ ఉన్నాం. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు. మన సమాజంలో మనం ఓ బలమైన వ్యవస్థను నిర్మించుకున్నాం. దాని కారణంగానే హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుంది. హిందువులు ఉనికి కోల్పోతే, ప్రపంచానికే ఉనికి ఉండదు. ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు.


