భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో నిరంతరం మంచు కురుస్తోంది. దీంతో రహదారులు, ఇళ్లు మంచుతో కప్పుకుపోయాయి. కనుచూపుమేర మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో కశ్మీర్ వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. అందాల శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు మైనస్ 3.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ లో మైనస్ 5.1 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పుల్వామాలోనూ ఉష్ణోగ్రతలకు దారుణంగా పడిపోయాయి. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్లో ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా.. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్లో కనిష్టంగా మైనస్ 1.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. మొత్తంగా అందాల కశ్మీర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.


