అయోధ్యలో నిర్మించిన రామాలయం పై ఇవాళ ధ్వజారోహణం జరిగింది. ఆలయ శిఖరంపై ఏర్పాటు చేసిన ధ్వజస్తంభంపై కాషాయ జెండా ఎగిరింది. దీంతో అయోధ్య రామాలయ నిర్మాణం సంపూర్ణమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇవాళ ఉదయం 11.50 నిమిషాలకు జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అద్భుత ఘటాన్ని తిలకించిన కాషాయ భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య రామ్లల్లా ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఉత్తర భారత దేశానికి చెందిన నగరా శైలిలో ఆలయాన్ని నిర్మించారు.
ధ్వజారోహణ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. త్రికోణంలో ఉన్న కాషాయ జెండాను శిఖరంపై ఎగురవేశారు. 10 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో ఆ జెండా ఉన్నది. ఆ జెండాలో ధగధగలాడే సూర్యుడి చిహ్నం ఉన్నది. శ్రీరాముడి ప్రతాపానికి గుర్తుగా సూర్య చిహ్నం ఉన్నది. కోవిదార వృక్షంతో పాటు ఓం చిహ్నం కూడా ఆ జెండాలో నిక్షిప్తం చేశారు. గౌరవం, ఐక్యత, సంస్కృతిక సమానత్వానికి చిహ్నంగా కాషాయ జెండాను ఎగురవేశారు. రామరాజ్యం ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు.


