ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ప్రతి ఏడాది సినిమాలతో పాటు తారలకు సంబంధించి వివిధ కేటగిరీలలో ప్రేక్షకాదరణ పొందిన జాబితాను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఏడాది పాపులర్గా నిలిచిన తారల జాబితాను విడుదల చేసింది ఐఎండీబీ. ఇందులో తెలుగు నుంచి ఒక్కరు కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. ఐఎండీబీ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది మోస్ట్ పాపులర్ తారలు ఎవరు అనేది చూసుకుంటే.. సైయారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ యువ నటులు ఆహన్ పాండే, అనిత్ పడ్డా, వరుసగా మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ను అందుకుంది. కూలీ కామియోతో మెరిసిన ఆమిర్ ఖాన్ ఈ ఏడాది మోస్ట్ పాపులర్ తారల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. హోమ్ బౌండ్ సినిమాతో మెప్పించిన ఇషాన్ ఖట్టర్ నాలుగవ స్థానంలో నిలువగా, బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాతో అలరించిన నటుడు లక్ష్య ఐదవ స్థానంలో దక్కించుకున్నాడు. రష్మిక మందన్నా ఆరో స్థానంలో నిలువగా, లోక చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఏడో స్థానం దక్కించుకుంది. ధడక్ సినిమాలో నటనకు గాను తృప్తి డిమ్రీ ఎనిమిదో స్థానంలో నిలువ, రుక్మిణి వసంత్ 9వ స్థానం, రిషబ్ శెట్టి 10వ స్థానం దక్కించుకున్నారు.


