ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం తొమ్మిదో రోజు వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఇండిగోకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిర్లైన్స్కు చెందిన శీతాకాలం షెడ్యూల్లో ఐదుశాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ ఇండిగో అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. ఎయిర్లైన్స్పై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం ఇండిగో రోజుకు సుమారుగా 2,200 విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం విమానాల సంఖ్య 110 వరకు తగ్గనున్నది. విమానాల షెడ్యూల్లో 5శాతం కోత విధించిన విషయాన్ని ఎయిర్లైన్స్కు డీజీసీఏ సమాచారం అందించింది. తగ్గించే విమానాల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నారు. నవంబర్ శీతాకాల షెడ్యూల్ ప్రకారం.. వారానికి 15,014 డిపాశ్చర్ విమానాలు.. మొత్తం 64,364 విమానాలకు విమానాయన సంస్థ ఆమోదం పొందినట్లుగా డీజీసీఏ ఇండిగోకు జారీ చేసిన అధికారిక నోటీసుల్లో పేర్కొంది.


