ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్యహించటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి 124 అర్జీలు వచ్చాయన్నారు. రెవిన్యూ, విద్యుత్, పెన్షన్లు, ఉపాధి అవకాశాల గురించిన అర్జీలు ప్రజలు సమర్పించినట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటికి పరిష్కారం చూపాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


