బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కాల్పుల్లో గాయపడిన బంగ్లాదేశ్కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ మృతితో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఢాకా సహా పలు నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మీడియా సంస్థలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ఏదైనా సాయం కావాలంటే హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది.


