అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా, గార్లకు చెందిన కడియాల భావన, పులఖండం మేఘన అనే ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. వారిద్దరూ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈ మధ్యనే ఎంఎస్ విద్యను పూర్తిచేసుకున్న వారిద్దరూ ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా విహారయాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడడడంతో మరణించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విదేశాంగ శాఖ మంత్రి, విదేశాంగ కార్యాలయాలకు ఫోన్ చేసి వీలున్నంత వరకు న్యాయం చేకూర్చేందుకు సహాయ సహకారాలు అందిస్తానని మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ తెలిపారు. బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.


