వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటు న్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు 100 మంది చెంచు గిరిజనులు మల్లికార్జునస్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు.
శ్రీశైల క్షేత్రానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా చెంచు గిరిజనులతో విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీశైలం అరణ్య ప్రాంతంలో నివసించే చెంచులు ఆదికాలం నుంచి ఈ క్షేత్రానికి సంరక్షకులుగా, సేవకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవంగా ఆలయ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకోవడం భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.


