బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ( బీఎన్పీ ) చైర్పర్సన్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లుగా బీఎన్పీ వెల్లడించింది. ఫజ్రు ప్రార్థనల తర్వాత ఆమె కన్నుమూశారని పేర్కొంది. 1945లో అప్పటి బ్రిటీష్ ఇండియాలోని జల్ఫాయిగుడిలో సికిందర్ కుటుంబంలో ఖలీదా జియా జన్మించారు. దేశ విభజన అనంతరం దినాజ్పూర్కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. 1960లో అప్పటి పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్ జియోర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. ఇక 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో జియోర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. 1981లో రెహమాన్ హత్య అనంతరం బీఎన్బీలో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఖలీదా జియా పార్టీ బాధ్యతలు చేపట్టారు. 1984లో బీఎన్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్ రాజకీయాలపైన ఖలీదా జియా బలమైన ముద్ర వేశారు. ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టిచారు. 1991లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. 1991-96, 2001-2006 మధ్య పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.


