అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కృష్ణ కిశోర్ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు పదిరోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గమధ్యంలో దుబాయ్ లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. తమతో ఎంతో ఆనందంగా గడిపి, వెళ్లిన తమ కొడుకు, కోడలు ఇక లేరు అనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.


