గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చీన్ టపాక్ డుం డుం అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి సమంత క్లాప్ కొట్టారు. గోపిచంద్ మలినేని తొలి షాట్కు దర్శకత్వం వహించారు. మల్లిడి వశిష్ఠ కెమెరా ఆన్ చేశారు. నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి కలిసి స్క్రిప్ట్ను అందజేసి చిత్రానికి శుభారంభం పలికారు. ఈ చిత్రాన్ని శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఆయన సంస్థ విలేజ్ టాకీస్లో తెరకెక్కిస్తున్న ప్రథమ చిత్రం ఇదే కావడం విశేషం. చీన్ టపాక్ డుం డుం చిత్రానికి వై.ఎన్. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా బ్రిగిడా సాగా నటిస్తున్నారు.


