తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో అద్భుతమైన దృశ్యకావ్యం ఆవిష్కృతం కాబోతోంది. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు గారు రచించిన తెలంగాణ సాయుధ పోరాట గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గొల్ల రామవ్వ. ప్రముఖ దర్శకుడు ముళ్ళపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.వి.నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి మాట్లాడుతూ మా నాన్నగారు రాసిన గొప్ప కథల్లో ఒకటైన గొల్ల రామవ్వను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రతి తెలుగువారి గుండెల్లో నిలిచిపోతుంది అని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పి.వి.ప్రభాకరరావు, నటుడు రాజీవ్ కనకాల, గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, దర్శకుడు యాటా సత్యనారాయణ తదితరులు పాల్గొని నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మలను అభినందించారు. సీనియర్ నటి తెలుగు సీతామాలక్ష్మి తాళ్ళూరి రామేశ్వరి ఇందులో టైటిల్ పాత్రను పోషించారు. అల్లు గీత, అన్విత్, మణి మంతెన ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా సాహిత్యాన్ని కూడా సమకూర్చారు. సాయి మధుకర్ సంగీతం అందించగా, గంగమోని శేఖర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.


