రాగి మన సంప్రదాయ ఆహారంలో ముఖ్యమైన ధాన్యం. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఎముకల బలానికి రాగి జావ ఎంతో ఉపయోగకరం. పెరుగుతున్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది మంచి పోషకాహారం. ఉదయం అల్పాహారంగా రాగి జావ తీసుకుంటే శరీరానికి స్థిరమైన శక్తి లభిస్తుంది. శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది సహజ ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. రాగి జావలో ఉండే ఆహార ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని క్రమంగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో ఇది ఉపయోగకరం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణులు బలహీనత, నీరసం ఉన్నవారు దీనిని ఆహారంలో చేర్చాలని సూచిస్తున్నారు.
రాగి జావను ఎలా తయారు చేసుకోవాలి?
• రాగి పిండిని నీటిలో ఉండలు లేకుండా కలపాలి.
• మోస్తరు మంటపై కలుపుతూ ఉడికించాలి.
• తీపి కోసం బెల్లం లేదా ఉప్పు రుచికి అనుగుణంగా కలపాలి.
• పాలు లేదా మజ్జిగ కలిపితే రుచి పెరుగుతుంది.
• వేసవిలో మజ్జిగ రాగి జావలో ఉల్లిపాయ ముక్కలు కలిపి తీసుకుంటే శరీరానికి చల్లదనం కలుగుతుంది.


