ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఏపీ అసెంబ్లీ, మండలిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై పెట్టిన తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసన మండలిలో దుమారం రాజుకుంది. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలిపెట్టేది లేదని అన్నారు. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే అది చిన్నమాట అవుతుందా? అని నిలదీశారు. అయితే, మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతుండగా విపక్షనేత బొత్స సత్యనారాయణ పలుమార్లు అడ్డుతగిలారు.
వైసీపీ నేతలు అంబటి రాంబాబును, ఆయన వ్యాఖ్యలను ప్రోత్సహిస్తే ఎలాగని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత తల్లి, చెల్లిని గౌరవించడం వైసీపీ నేతలకు చేత కాదన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి వైసీపీకి లేదని, కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. జగన్ తల్లి, చెల్లి అయినా, ఇంకే మహిళ జోలికి వెళ్లినా తాము ఊరుకోమని హెచ్చరించారు. బెంగళూరులో ఉన్న జగన్.. అంబటి రాంబాబు ఏదో రెండు చిన్న మాటలు అన్నారని ఎలా అంటున్నారని ఫైర్ అయ్యారు లోకేశ్. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే అది ఏదో రెండు చిన్నమాటలా? అని దుయ్యబట్టారు. మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు.


