వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్కృతిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత స్కీమ్లతో ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా తమిళనాడులోని విద్యుత్తు బోర్డు ఉచిత విద్యుత్తు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ అంశాన్ని కోర్టు సీరియస్గా తీసుకున్నది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా, వినియోగదారులకు ఎలా ఉచిత విద్యుత్తును అందిస్తారని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డును కోర్టు ప్రశ్నించింది.
చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయలోటుతో ఉన్నాయని, కానీ అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఉచితాలు ప్రకటిస్తున్నాయని కోర్టు పేర్కొన్నది. ఉచిత పథకాలను అమలు చేయడం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని కోర్టు చెప్పింది. ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్తులను ఇవ్వడం కన్నా.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని కోర్టు పేర్కొన్నది. ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంలో డీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది.


