అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన ఒక సభలో ట్రంప్ ప్రసంగించారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో మోసం చేసేందుకే ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ ఐడీని జాత్యహంకారంతో ముడిపెట్టడం సరికాదని, 95 శాతం మంది ప్రజలు ఈ నిబంధనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, పోస్టల్ బ్యాలెట్ (మెయిల్-ఇన్ బ్యాలెట్) విధానంపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. కేవలం సైనికులు, అనారోగ్యంతో ఉన్నవారు, విహారయాత్రలకు వెళ్లిన వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని సూచించారు.


