తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఈ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం, అందులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కవిత చేసుకున్న దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపించినట్లు ఈసీఐ తరుపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అయితే, ఆ రోజు కవిత తరుపు లాయర్ గైర్హాజరీ కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడింది. ఆ పిటీషన్ మరోసారి విచారణకు రానుంది.


