తెలంగాణ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. కేరళలో అమలు చేస్తున్న కుటుంబశ్రీ మోడల్ ను అనుసరించి ఈ పథకానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. కేరళలో ఒక సర్వే నిర్వహించారని, దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించి, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని సీతక్క తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా సర్వే చేయించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తిస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి తగిన సాయం అందిస్తామని సీతక్క తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడినా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.


