తమిళనాడులోని అన్నాడీఎంకేకు మరో షాక్ ఎదురైంది. ఆరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కరూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విజయభాస్కర్, అధికార టీవీకేలో చేరవచ్చని తెలుస్తున్నది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా విజయభాస్కర్ నిలిచారు. ఆయనకు ముందు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే సీ విజయభాస్కర్ రాజీనామా చేశారు. అంతకు ముందు నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు. ఆరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామాతో తమిళనాడులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో సీఎం విజయ్ వదులుకున్న తిరుచిరాపల్లి తూర్పు స్థానం కూడా ఒకటి.

































