తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు మరోసారి చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన తుది పిటిషన్ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. విచారణలో సునీల్ కుమార్ వాదనలు విన్న ట్రిబ్యునల్, ఆయనకు ఎలాంటి ఊరట కల్పించేందుకు నిరాకరించింది. సస్పెన్షన్ను రద్దు చేయాలన్న అభ్యర్థనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. తనపై విధించిన సస్పెన్షన్ను చట్టవిరుద్ధంగా పరిగణించి, దానిని రద్దు చేయాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను సునీల్ గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీలు, సస్పెన్షన్లు, క్రమశిక్షణా చర్యలపై క్యాట్ ఎప్పటికప్పుడు విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇస్తుంది. క్యాట్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో సునీల్ కుమార్పై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న అభ్యర్థనను క్యాట్ కొట్టివేయడంతో, ఈరోజు పని వేళలు ముగిసిన తర్వాత ఆయన పదవీ విరమణను సస్పెన్షన్లోనే నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

































