ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యం ఇచ్చామని, ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీని శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజల ముందు ఉంచుతున్నామని వివరించారు. దీనిపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని సీఎం తెలిపారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ లాంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని, భారత్తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొందని వెల్లడించారు.
రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.5గా ఉందని, 1993లో ఇది 3.0గా నమోదైందని వివరించారు. టీఎఫ్ఆర్ వేగంగా తగ్గితే పని చేసే వయస్సులో ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గి, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 6.70 లక్షల జననాలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాగే కొనసాగితే 2047 నాటికి జనాభాలో 23 శాతం మంది వృద్ధులు ఉంటారని అన్నారు. మహిళల లేబర్ ఫోర్సు పార్టిసిపేషన్ రేట్ ప్రస్తుతం 31 శాతంగానే ఉంటుందని.. ఇది 59 శాతానికి చేరితే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుందని తెలిపారు.


