తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శనం టికెట్లు, వసతి, విరాళాలు, రవాణా వంటి అంశాలపై ఏ సందేహం ఉన్నా క్షణాల్లో సమాధానం లభించేలా 13 భాషల్లో పనిచేసే ఏఐ చాట్బాట్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం కాల్ సెంటర్ల ద్వారా సమాచారం పొందాలంటే భక్తులు ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది. భాషా సమస్యలు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందు కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్బాట్ను ప్రవేశపెట్టనున్నారు. మరో 15 రోజుల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది ఒకేసారి వేలాది మంది భక్తులతో మాట్లాడగలదు, రియల్ టైమ్ సమాచారం అందిస్తుంది.
ఈ ఏఐ చాట్బాట్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ వేదికగా అభివృద్ధి చేస్తున్నారు. టైప్ చేయడంతో పాటు టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. నెలకు సుమారు రూ.4 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.50 లక్షల వ్యయంతో 24 గంటలూ పనిచేసే ఈ సేవలు భక్తులకు సమయం, శ్రమ రెండింటినీ ఆదా చేయనున్నాయి.


