అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇద్దరూ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విరాళాల లెక్కింపులో, నగదు నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి. ఆలయ ఖాతాల నుంచి దాదాపు రూ. 7-7.5 కోట్లు గల్లంతయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అధికారిక లెక్కలు ఇంకా వెలువడలేదు. కాగా, రెండు రోజుల క్రితం సిట్ తమ ప్రాథమిక నివేదికను యూపీ సర్కారుకు సమర్పించింది.
అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో చంపత్ రాయ్ డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.

































