త్వరలో వినాయక చవితి సందడి మొదలు కానుంది. దేశమంతా గణపతి విగ్రహాల తయారీ మొదలైంది. తెలుగురాష్ట్రాల్లో ఖైరతాబాద్ విఘ్నేశునిది ప్రత్యేక స్థానం. ప్రతిసారీ లంబోదరుడు అత్యంత ఎత్తైన, విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. ఈసారి బడా గణేశుడు 69 అడుగుల్లో పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రం విడుదల చేసింది. విగ్రహానికి ఓవైపు కాళీమాత, మరోవైపు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి కూడా ఈ భారీ విగ్రహాన్ని శిల్పి రాజేంద్రన్ సిద్ధం చేయనున్నారు. ఇవాళ విగ్రహ ఏర్పాటు కర్రపూజ నిర్వహించారు. సెప్టెంబర్ 14న చవితి పండగ జరగనుండగా, ఈ ఏడాదితో ఖైరతాబాద్ భారీ లంబోదరుడి ఉత్సవాలకు 72 ఏళ్లు పూర్తికానున్నాయి.

































