తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ విద్యా, సమాచార సాంకేతిక (ఐటీ) శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలతో పాటు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.ఆలయ దర్శనంలో భాగంగా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా నిర్వహించే తిరుప్పావడ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాల కోసం ప్రార్థించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలకగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ దర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్రెడ్డి పాల్గొన్నారు.

































