ఈపీఎఫ్వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరిలోపు ఈపీఎఫ్ అమౌంట్ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన అన్నారు.
ఈపీఎఫ్వో 3.0 కింద ఈ కొత్త విధానం అమలుకానుంది. ఈ సదుపాయం అమలులోకి వస్తే ఈపీఎఫ్ డబ్బును త్వరగా విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తై, అనుమతి లభిస్తే నగదును త్వరగా యూపీఐ ద్వారా లేదా ఈపీఎఫ్వో ఎనేబుల్డ్ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఈపీఎఫ్ అకౌంట్లలోని 75 శాతం డబ్బును ఇలా తమ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూపీఐ లేదా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ విధానాన్ని కేంద్రం అమలు చేయబోతుంది. ఓటీపీ ద్వారా ఇలా నగదు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది.

































