పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా సందేశంతో కోట్లాదిమంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతికి సీఎం, మంత్రులు ఘన స్వాగతం పలికారు.


