వైసీపీ నేత పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తన కంపెనీకి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరుతూ ఆయన సతీమణి పేరిట దాఖలు చేసిన పిటిషన్ను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గత ప్రభుత్వ కాలంలో పి.ఎల్.ఆర్ కంపెనీ ద్వారా చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఈ బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును పెద్దిరెడ్డి ఆశ్రయించారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం, ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీనిపై పెద్దిరెడ్డి తరఫు న్యాయవాదులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 12 కేసులు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు వివరించారు. అయినప్పటికీ, హైకోర్టు పరిధిలోనే ఈ అంశం పరిష్కారం కావాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు సూచనల మేరకు పెద్దిరెడ్డి తరఫు న్యాయవాదులు తమ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులోనే కొనసాగనుంది.


