సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం సంపన్నులను ఆలోచనలో పడేసింది. పలువురు బిలియనీర్లు యూకేను వీడి, పన్ను మినహాయింపు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు యూకేని వీడగా, ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ వచ్చి చేరారు. భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్, బ్రిటన్ను వీడనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పన్ను విధానం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడాలని మిట్టల్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.


