రాష్ట్రంలోని ఐటీ కంపెనీలపై గత వైసీపీ ప్రభుత్వం యుద్ధం చేసిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ఫార్చ్యూన్ 500లోని ఒక కంపెనీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే వారిని సైతం వెళ్లగొట్టిందంటూ వైసీపీ గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిజం మాదిరిగా వ్యవహరించి కంపెనీలను పంపించారంటూ ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు లోకేశ్. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సదరు కంపెనీలతో మాట్లాడితే గత అనుభవాలను చెప్పి వారు ఆందోళన వెలిబుచ్చారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఒప్పించి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. 8 రకాల పాలసీలు తీసుకువచ్చి కంపెనీలకు మార్గం సుగమం చేశామని లోకేశ్ స్పష్టం చేశారు.
సభలో లేకుండా బయట ఏదేదో ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా లోకేశ్ ఎండగట్టారు. నానో కంపెనీ ఏర్పాటుపై పశ్చిమ బెంగాల్లో పెద్దఎత్తున ఆందోళన జరిగితే,నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న గుజరాత్కు ఆ సంస్థను ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. తద్వారా గుజరాత్లో ఆ పరిశ్రమ ఏర్పాటైందన్నారు.


