కోటి మొక్కల సంకల్పంతో ధరిత్రిని పచ్చని తోరణంగా మార్చిన అపర భగీరథుడు, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవిత ప్రస్థానం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఈ మహనీయుడి కథ ఆధారంగా తెరకెక్కిన వనజీవి రామయ్య బయోపిక్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో ఉత్తమ లఘు చిత్రాల విభాగంలో ఎంపికై చిత్ర యూనిట్ ప్రతిభను చాటిచెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన ఈ చిత్ర ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావుతో పాటు సినీ దిగ్గజాలు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు హాజరై రామయ్య గారి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసల జల్లు కురిపించారు.
నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా భారతీయ ప్రధాన భాషలన్నింటిలోకి అనువదించి విడుదల కానుంది. రామయ్య గారి సందేశం ప్రపంచవ్యాప్తం కావాలనే ఉద్దేశంతో నిర్మాతలు నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నాగరాణి, నాగమల్ల మహేష్, శ్రీనివాస రాయుడు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు అంకితమిస్తూ రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే అన్ని భాషల్లోని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.


