రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా, ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో కూడా తెలుగువారు సెనేటర్లు అవుతున్నారు. ప్రజాసేవ చేసినవారినే ప్రజలు ఆదరిస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలి. రెండు రాష్ట్రాలనూ ప్రగతి పథంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలి అని అన్నారు.


