దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్ను. ఈరోజు ఇంతమంది యువతీయువకులకు పట్టాలు అందించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని ఆమె విద్యార్థులకు హితవు పలికారు. మీరు జీవితంలో ముందుకు వెళ్లడమే కాదు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు కనిపిస్తారు. వారిని ప్రోత్సహించడంలో మీ వంతు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. వికాసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా యువత పాత్ర ఎంతో కీలకమని, దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

































