ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు. బీజేపీ నాయకుడైన ఆయన బీరెన్ సింగ్ వారసుడిగా, ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలోనే మణిపూర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మణిపూర్ లోని ప్రధానమైన మీటీస్, కుకిస్ తెగల మధ్య నిరుడు విభేదాలు తారా స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రిగా నేను ఉండలేనంటూ నిరుడు ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా ఉంది. ఆయన వారుసుడిగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది. మాజీ స్పీకర్ యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్, క్యాబినెట్ మంత్రి బిస్వజిత్, సత్యబత్రా సింగ్లలో ఒకరు తదుపరి సీఎం అవుతారనే వార్తలు వినిపించాయి. కానీ చివరకు బీజేపీ అధిష్టానం ఖేమ్చంద్ వైపు మొగ్గు చూపింది. దాంతో ఆయనను శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నారు. త్వరలోనే ఖేమ్చంద్ నేతృత్వంలో మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన ఖేమ్చంద్ ఎన్నికల్లో ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సింగ్జమేయి నియోజయకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


